జంధ్యాలను కలవడానికి వెళితే ఏం జరిగిందంటే.. !: రేలంగి నరసింహారావు

  • జంధ్యాల గురించి ప్రస్తావించిన రేలంగి నరసింహారావు
  • హాస్యం పై తమ మార్కు విభిన్నమని వెల్లడి 
  • జంధ్యాలతో ఫొటో తీయించుకున్న సందర్భం వివరణ 
  • తనతో సమానమైన స్థానం ఇచ్చారంటూ హర్షం
తెలుగు తెరపై హాస్య ప్రధానమైన కథలను పరుగులు తీయించిన దర్శకుల జాబితాలో రేకంగ నరసింహారావు ఒకరిగా కనిపిస్తారు. అలాంటి రేలంగి నరసింహారావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "జంధ్యాల గారు హాస్య భరితమైన సినిమాలను తెరకెక్కించేవారు .. నేను అదే జోనర్లో ముందుకు వెళుతూ ఉండేవాడిని. కాకపోతే హాస్యంపై మా మార్కు వేరుగా ఉండేది" అన్నారు. 

" నా సినిమాలు చూసిన జంధ్యాల గారు నన్ను మెచ్చుకున్నట్టుగా కొంతమంది ద్వారా నాకు తెలిసింది. దాంతో ఆయనను కలుసుకోవడానికి నేను వెళ్లాను. ఆ సమయంలో నేను గుండుతో ఉన్నాను .. ఆయన కూడా గుండుతోనే ఉన్నారు. నన్ను చూడగానే ఆయన ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు" అని చెప్పారు. 

"సెట్లోని ఫొటోగ్రాఫర్ ను పిలిచి మా ఇద్దరినీ ఒక ఫొటో తీయమన్నారు. ఆ ఫొటో వచ్చిన తరువాత ఒక కాపీ నాకు పంపించారు. మేమిద్దరం గుండుతో తీయించుకున్న ఆ ఫొటో వెనుక, 'హాస్యమనేది రెండు గుండ్ల పిస్తోలు' అని రాశారు" అంటూ నవ్వేశారు. తనతో సమానమైన దర్శకుడిగా ఆయన నన్ను గుర్తించడం కంటే నాకు ఆనందం ఏవుంటుంది?" అంటూ చెప్పుకొచ్చారు. 


Relangi Narasimha Rao
Director
Jandhyala
Tollywood

More Telugu News